ఒకేసారి ముంచెత్తిన చదువుల ఫీజులు, సాగు ఖర్చులు
అందని ప్రభుత్వ పెట్టుబడి సాయం
నవతెలంగాణ – మల్హర్ రావు
అదిగో వర్షం..ఇదిగో బడి.. పల్లెల్లో ఇప్పుడు ఎటుచూసినా ఇదే సందడి.ఒకవైపు చిరు జల్లులు కురుస్తుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల కోలాహలం మొదలైంది.అయితే, ఈరెండు ముచ్చట్లు ఒకే తలుపు తట్టడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ‘తడిసి మోపె డవుతోంది’.పిల్లల చదువుల ఖర్చులు, పాలం పనుల పెట్టుబడులు ఒకేసారి నెత్తిన పడటంతో తల్లిదండ్రులు, రైతుల దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కానరాని ప్రభుత్వ సాయం
సాధారణంగా జూన్లో వర్షాలు పడగానే రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుతోపాటు నాట్ల పనులకు శ్రీకారం చుడుతున్నారు.ఈ సమయంలోనే పెట్టుబడికి పైసలు ఎంతో అవసరం. అయితే, ప్రభుత్వం అందించాల్సిన పెట్టుబడి సాయం ఇప్ప టివరకు రైతులకు అందకపోవడం క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. సకాలంలో పెట్టు బడి సాయయం అందుతుందని ఆశపడ్డ రైతన్నలకు నిరాశే మిగిలింది. పనులు ముమ్మరంగా సాగుతున్నా ప్రభుత్వ ఖాతాల నుంచి పైసలు విడుదల కాకపోవడంతో, చేతిలో రూపాయి లేక రైతులు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రభుత్వ సాయం ఆలస్యం కావడంతో విత్తనాలు నాట్ల ఖర్చుల కోసం కోసం రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగును సాగదీస్తున్నారు.
రైతును ఆదుకునేదెవరు..?
ఇటు పిల్లల చేతికి పుస్తకాలు ఇవ్వడానికి, అటు భూమికి విత్తనాలు వేయడానికి ఒకేసారి డబ్బులు ఒకవైపు వ్యవసాయ పెట్టుబడులు నడ్డి విరుస్తుంటే,మరోవైపు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడం ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి తెరలేపింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్దేశించిన దుకాణాల్లోనే పుస్తకాలు,నోట్బక్స్, యూనిఫారాలు, షూస్,బెల్టులు కొనాలనే నిబంధనలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రైవేటు పాఠశాలలు గుంజుతున్న ఫీజులు, డొనేషన్లు తలప్రాణం తోకకు తెస్తున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే,విద్యా సంవత్సరం మొదట్లోనే వేలాది రూపాయల చేబదుళ్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అవసరం కావడంతో మధ్య తరగతి, పేద రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. “ప్రభుత్వ పెట్టుబడి సాయం ఈపాటికే అంది ఉంటే కొంతైనా ఊరట లభించేదని, ఇప్పుడు అటు స్కూలు ఫీజులకు, ఇటు నాట్ల ఖర్చులకు రెండింటికీ అప్పులే దిక్కయ్యాయి” అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం ఇకనైనా స్పందించి కాలయాపన చేయకుండా తక్షణమే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులను జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై అధికారులు గట్టి నిఘా పెట్టి,సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.



