నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని, టెల్అవీవ్కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని ఈ ఆందోళన జరిగింది. దాదాపు 35,000 మంది నిరసనకారులు దీనిలో పాల్గొన్నారు. వీటిని ముందే ఊహించిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారు చాలా మంది ఎర్రని వస్త్రాలు ధరించి.. ఫ్రీ పాలస్తీనా, ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు దాదాపు 2 మైళ్ల పొడవైన బ్యానర్ను శ్వేత సౌధం వద్ద ప్రదర్శించారు. ఆపరేషన్ రఫాలో ఇజ్రాయెల్ రెడ్లైన్ దాటడంపై నిరసనగా దీనిని ప్రదర్శించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి రఫాలోనే పాలస్తీనా వాసులు తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. పొగ వెదజల్లే వస్తువులను శ్వేత సౌధ ప్రాంగణంలోకి నిరసనకారులు విసిరేశారు. ఈ సమయంలో అధ్యక్షడు జోబైడెన్, ఆయన సతీమణి జిల్ ఇంట్లో లేరు. ఫ్రాన్స్లో జరుగుతున్న డీడే స్మారక కార్యక్రమల్లో పాల్గొననున్నారు.