Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్‌ఓసీ తర్వాత పాస్‌పోర్టు మంజూరు

ఎన్‌ఓసీ తర్వాత పాస్‌పోర్టు మంజూరు

- Advertisement -

మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ కేసులో హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌

పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులకు సంబంధించి కింది కోర్టు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకుని దానిని సమర్పించాక చట్టప్రకారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పాస్‌పోర్టు మంజూరు అంశాన్ని పరిశీలించాలని పాస్‌పోర్టు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఎన్‌ఓసీ కోసం సంబంధిత ట్రయల్‌ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి లక్ష్మణ్‌కి సూచించింది. పిటిషనర్‌ అయిన మంత్రి చేసుకునే దరఖాస్తుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలంది. పెండింగ్‌ కేసులున్నాయనే కారణంతో పాస్‌పోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ జరిపి ఇటీవల ఈ ఉత్తర్వులను జారీ చేశారు. క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన పాస్‌పోర్టు జారీకి అడ్డంకి కాదనీ, ఇదే సమయంలో పాస్‌పోర్టు జారీ అయితే విదేశీ ప్రయాణానికి తాము అనుమతి ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు.

బయోమెడికల్‌ వ్యర్థాల సేకరణలో పీసీబీ బిల్లింగ్‌ విధానం సబబే : హైకోర్టు
ఆస్పత్రుల్లో బయోమెడికల్‌ వ్యర్థాల సేకరణకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తున్న కొత్త బిల్లింగ్‌ విధానాన్ని హైకోర్టు సమర్ధించింది. ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లపై సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మస్‌ చేసింది. కొత్త విధానంలో జోక్యానికి ఆస్కారం లేదంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పీసీబీ చట్ట ప్రకారమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని పేర్కొంది. పడకలున్న, లేని ఆస్పత్రులకు వేర్వేరు బిల్లింగ్‌ విధానం సమర్థనీయమని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై నిర్ధిష్ట కాల వ్యవధిలో చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర పీసీబీలను ఆదేశించింది.
డీజీపీ నియామకం కేసు వాయిదా
డీజీపీ నియామక ప్రక్రియ కొనసాగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు యూపీఎస్సీ ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో ప్యానెల్‌ను సిద్ధం చేసి మార్చి 12న పంపిందనీ, అది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజీపీ నియామకం జరిగిందని టి.ధనగోపాల్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఏజీ ఈ వివరాలు తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.
ఘనంగా అంబేద్కర్‌ జయంతి
హైకోర్టులో అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పౌరుల హక్కుల రక్షణకు, సమసమాజస్థాన కోసం అంబేద్కర్‌ రాజ్యాంగం రూపకల్పనకు చూపిన చొరవ మరువలేనిదని ముఖ్య అతిధి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక చెప్పారు. జస్టిస్‌ మొహియుద్దీన్‌, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ చైర్మెన్‌ సురేందర్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ నర్సింహారెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -