నవతెలంగాణ – డెహ్రాడూన్ : పతంజలికి చెందిన 14 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయింది. ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. వాణిజ్య ప్రకటన విషయంలో ‘డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్’, ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్’ను పతంజలి ఉల్లంఘించినట్లు అథారిటీ నిర్థారించింది. ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం చేసిన ప్రయోజనాలపై ఆధారాలను సమర్పించడంలో విఫలమైనట్లు తెలిపింది. అలాగే తమ వాదనను సమర్థించుకుంటూ ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ … పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం-అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించింది. ఇకపై అలాంటివేవీ ఉండబోవని అప్పట్లో సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. అయినా, వాటిని ఉల్లంఘించటంతో కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.