టీచర్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

– ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్‌ లీవు, మెడికల్‌ బిల్లులు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వంటి బిల్లులను వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ తొలి పీఆర్సీలో 30 శాతం ఫిట్‌మెంట్‌ సాధించామని గుర్తు చేశారు. రెండో పీఆర్సీలో మంచి ఫిట్‌మెంట్‌ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోర్టు అడ్డంకులను తొలగించి త్వరలోనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను కొనసాగించడమే కాకుండా సర్వీస్‌ రూల్స్‌ను కూడా సాధిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్‌రెడ్డి, పూల రవీందర్‌, సంఘం ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, నాయకులు చిత్తలూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love