ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

– ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్టమైన బందోబస్తు
– మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు
– ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌
– ఎస్పీ రోహిత్‌ రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా భద్రతాపరమైన అన్ని రకాల చర్యలను పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు మీడియాకు వెల్లడించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 971 పోలింగ్‌ కేంద్రాలలో జరగబోయే ఓటింగ్‌లో ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులకు అనుమతి లేదని, ప్రజలంతా ఇట్టి విషయాన్ని గమనించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాలలోగానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టె వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం, ఇతరత్రా వస్తువులను ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి గానీ, సీ-విజిల్‌ యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేసి సమాచారం అందజేయాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని, ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కావున ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే పోలింగ్‌ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love