లీటరుకు 90పైసలు పెంపు
న్యూఢిల్లీ : కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని వేరియంట్లకూ లీటరుకు 90పైసలు చొప్పున పెంచారు. నాలుగేండ్ల విరామం తర్వాత ఈ నెల 15న లీటరుకు రూ.3 పెరిగినప్పటి నుంచి తాజా పెంపును కూడా కలుపుకుంటే మొత్తంగా రెండు ఇంధనాల రిటైల్ ధరలు రూ.3.90 చొప్పున పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నా… పట్టించుకోకుండా ధరలను వరుసగా పెంచుకుం టూ పోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నైలతో పోల్చుకుంటే కోల్కతాలో వీటి ధరలు బాగా పెరిగాయి. కోల్కతాలో పెట్రోల్ 96పైసలు పెరిగి లీటరు రూ.109.70కి చేరుకుంది. డీజిల్ 94పైసలు పెరిగి లీటరు రూ.96.07కి చేరింది. తాజా పెంపుతో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.98.64గా వుండగా, డీజిల్ 91పైసలు పెరిగి లీటరు రూ.91.58కి చేరుకుంది. ముంబయిలో 91పైసలు పెరిగి లీటరు పెట్రోల్ రూ.107.59కి చేరుకోగా, డీజిల్ 94పైసలు పెరిగి రూ.94.08కి చేరింది. చెన్నైలో వరుసగా పెట్రో, డీజిల్ ధరలు లీటరుకు రూ.104.49, రూ.96.11గా వున్నాయి. ఈ నగరంలో పెట్రోల్ లీటరుకు 82పైసలే పెరగగా, డీజిల్ 86పైసలు పెరిగింది. ఇంక ఇతర మెట్రో నగరాల్లో దాదాపుగా 90పైసలే పెరిగింది.
దూరదృష్టి లేదు : కాంగ్రెస్
సామాన్యులను దోచుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘నేపథ్యాన్ని సిద్ధం చేసుకుని, పొదుపు గురించి బోధిస్తూ, తమ వైఫల్యాల భారాన్ని మాత్రం ప్రజలపైకి తోసేసున్నారు – ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో సాగుతోంది.’’అని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. సామాన్యుడిని దోచుకోవడం, అదానీని కాపాడడం ఇదే మోడీజీ లోపభూయిష్టమైన నమూనా అని ఆయన విమర్శించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్రప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాల్సి వుందని అన్నారు. రష్యా చమురు కొనుగోలును ప్రస్తావిస్తూ, ‘‘విశ్వగురు నంటూ గొప్పలు చెప్పకునే మోడీజీ, ఒక నెల రోజుల పాటు రష్యా చమురు కొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ అమెరికాను వేడుకున్నారు. ప్రతీసారీ ఆయన ఇదే చేస్తూంటారు. 140కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని ఆయన ఈ రకంగా దెబ్బతీస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో ఇలా చేయలేదు.’’ అని ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ కథనం ప్రకారం మనను అనుమతించినట్లైతే, ఇలా పెట్రో, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై ఎందుకు భారం మోపుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో దూరదృష్టి లోపించిందని, నాయకత్వ లోపం వుందని ఆయన వ్యాఖ్యానించారు.
మళ్లీ పెట్రోల్, డీజిల్ బాదుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



