నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్లో కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్పై సందిగ్ధత నెలకొంది. ఫైనల్ బెర్తు కోసం ఇవాళ న్యూ చండీగఢ్లోని పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. చండీగఢ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య చండీగఢ్లో వర్షం పడే సూచనలున్నాయి. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం పూట వాతావరణం నిర్మలంగా ఉన్నప్పటికీ, సమీపంలోని హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది.



