ఉత్కంఠకు తెర…రాయ్‌బరేలి నుంచి రాహుల్‌ గాంధీ..

నవతెలంగాణ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాయ్‌బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) బరిలోకి దిగుతున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. అదేవిధంగా అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మను (Kishori Lal Sharma) ఆ పార్టీ రంగంలోకి దించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా జాబితాను విడుదల చేసింది.
ఈ రెండు స్థానాల్లో నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. రాహుల్‌ గాంధీ ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు మరో స్థానంలో బరిలో నిలుస్తున్నారు. అయితే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఈసారికి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా, రాయ్‌బరేలిలో నేడు రాహుల్‌ గాంధీ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు.

Spread the love