పీసీసీ పదవి శాశ్వతం కాదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వలన వాతావరణం చలిపుట్టిస్తుంటే.. రాజకీయాలు మాత్రం తీవ్ర వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ – బీజేపీ మైత్రిపై, కేసీఆర్ పై, రేవంత్ రెడ్డిపై అభిప్రాయాలను చెప్పిన ఆయన 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.  ఆ వివరాలు ఆయన మాట్లాలోనే..
‘నేను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో 27న కాంగ్రెస్‌లో చేరుతున్నాను. మునుగోడు, ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని బీజేపీ చెప్పింది. బీజేపీకి నేను పనికిరాను అని అధిష్ఠానానికి చెప్పాను. నాకు టికెట్ వద్దని అధిష్ఠానానికి క్లియర్‌కట్‌గా నేనే చెప్పాను. కమ్యూనిస్టులను మోసం చేసింది కేసీఆర్.  నేను టికెట్ కోసం కాంగ్రెస్‌లోకి రావడం లేదు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలి. నేను ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే పనిచేశాను. నాకింకేం పదవులు కావాలి..?  బీజేపీ- బీఆర్ఎస్ ఒకటే. మోడీ, షా లంటే ఇప్పటికీ గౌరవం ఉంది. బీజేపీలోనే ఉండాలని నిన్నటి వరకు అనుకున్నాను. కానీ, సర్వేలు, ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు. ప్రజల మనిషిని కాబట్టి ప్రజలు చెప్పినట్టే వింటాను కాంగ్రెస్ ఒక  మహాసముద్రం’ అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీ చేస్తాను. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో పోయి చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాను. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మునుగోడులో ఓడిపోయినప్పుడు బాధపడలేదు. ఏ తప్పు చేయకుండా, మచ్చ లేకుండా నిజాయితీగా పనిచేశాను. నేను అమ్ముడు పోయానని కొందరు అన్నప్పుడు బాధపడ్డాను. దిగజారి నాపై విమర్శలు చేసినందుకు మనసులో ఏడ్చాను. నాపై విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు..?. నాపై ఆరోపణలు చేసిన వారు గుండెపై చేయి వేసుకొని సమాధానం చెప్పాలి. నన్ను కొనగలిగే శక్తి పుట్టలేదు.. పుట్టబోదు. నేను ఎక్కడ రాజీ పడలేదు. నా జీవిత ఆశయం కేసీఆర్‌ను గద్దె దించడమే. చేతిలో చిల్లిగవ్వ లేని కేసీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్నాడు. కేసీఆర్ మొహంలో రక్తం లేదు. ఓడిపోతామనే భయం కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యమంలో పని చేసిన వాళ్ళని కలిసి తప్పు చేశామని కాళ్ళు పట్టుకుంటున్నారు. బావ బామ్మర్థులు కలిసి చిన్న చిన్న నాయకులను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారుఅంటూ కేసీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి విమర్శల దాడి చేశారు.

రేవంత్ నాకేమైనా శత్రువా?
‘రాజగోపాల్‌రెడ్డి పార్టీలోకి వస్తానంటే ఒక మెట్టు దిగుతా అని రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నారు. నా జీవితంలో ఇది అతిపెద్ద నిర్ణయం. రేవంత్ నాకేమైనా శత్రువా? కొన్ని సందర్భాల్లో బేధాభిప్రాయాలు ఉంటాయి. మా మధ్య ఉన్నది బేధాభిప్రాయాలే కానీ, శత్రుత్వం కాదు. పీసీసీ పదవి శాశ్వతం కాదు. మునుగోడులో గెలిచామని బీఆర్ఎస్ చెప్పుకొలేని పరిస్థితి. కేసీఆర్‌ని తప్పుకుండా జైలుకు పంపుతాం’ అని రాజగోపాల్ అన్నారు.

Spread the love