నవతెలంగాణ కొడంగల్: త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మహిళలకు శుభవార్త వినిపిస్తాం అని కూడా ఆయన తెలిపారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్రావు మాట్లాడుతూ.. మహిళల కోసం సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్, గృహలక్ష్మి ఇలా అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. త్వరలో విడుదల చేయనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టో మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు ఉంటాయని, త్వరలో శుభవార్త వింటారని మంత్రి స్పష్టం చేశారు.
కోస్గి, కొడంగల్లో ఒకప్పుడు మంచి నీటి కష్టాలుండేవి.. మూడొద్దులకు ఒకసారి నీళ్లు వచ్చేవని హరీశ్రావు గుర్తు చేశారు. ట్యాంకర్ల వెంట నీళ్ల కోసం పరుగెత్తేవారు. గతంలో బోరింగ్లు కొట్టి, నీళ్లుమోసి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నాం. మా ప్రభుత్వం కొడంగల్ ఆడబిడ్డల కష్టాలు తీర్చింది. రేవంత్ రెడ్డి గెలిచి ఉంటే మరో 10 ఏండ్లు అయినా మంచినీళ్లు రాకపోయేవి. మీ పక్కనే కర్ణాటక ఉంది. అక్కడ కల్యాణ లక్ష్మి ఉందా? 12 లక్షల పెండ్లిలకు రూ. 11 వేల కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనేటోళ్లు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పోదాం పదా బిడ్డ సర్కార్ దవాఖానాకు అనే అంత గొప్పగా ఆస్పత్రులను అభివృద్ధి చేశాం. పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ అందిస్తున్నాం అని హరీశ్ అన్నారు.