నవతెలంగాణ హైదరాబాద్: కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్మించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు టీపీసీసీ ఆద్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా అన్న మోడీ ఇండియా పేరు మారుస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరు మారుస్తామంటున్నారని ధ్వజమెత్తారు.
‘‘పెరిగిన ధరలు, మణిపూర్ అంశాలపై మోడీ పార్లమెంట్లో చర్చించడం లేదు. కేవలం కాంగ్రెస్ను తిట్టడానికే ఆయన పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందన్న మోడీ.. గుజరాత్లో మోడీ తిరుగుతున్న ఎయిర్పోర్టు కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని గుర్తుచేశారు. నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది కాంగ్రెస్ కాదా? తెలంగాణకు స్వాతంత్ర్యం కల్పించింది కాంగ్రెస్ కదా? మా పార్టీ అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ కాదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం అభివృద్ధిని లెక్క కడదామా? విభజించు, పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతోంది’’ రేవంత్రెడ్డి విమర్శించారు.