నేటి నుంచి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కార్యకలాపాలు ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ల కోసం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నుంచి వచ్చిన 1006 దరఖాస్తుల వడపోత ప్రక్రియ ముగిసింది. రెండోసారి పీఈసీ ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆశావహుల వివరాలను సభ్యులకు పీసీసీ అందించింది. 500 పైగా పేజీలతో కూడిన బుక్‌లెట్‌లో దరఖాస్తుదారుల పూర్తి వివరాలు పొందుపరిచారు. ఆశావహులకు పార్టీతో ఉన్న అనుబంధం, బలోపేతానికి చేసిన కృషి, స్థానిక రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని అర్హులైన అభ్యర్థులను పీఈసీ సభ్యులు ఎంపిక చేశారు. పీసీసీ తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ వడపోత కార్యక్రమం మొదలు కానుంది. ఇందుకోసం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌, జిగ్నేశ్‌ మేవాని, బాబా సిద్ధిఖీ, ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌ రానున్నారు. స్క్రీనింగ్‌ కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండనుంది. మొదటిరోజైన ఇవాళ పీఈసీ సభ్యులతో, రెండో రోజు డీసీసీలు, సీనియర్‌ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. మూడో రోజు పీఈసీ అందించిన అభ్యర్ధుల జాబితాను నిశితంగా పరిశీలించి వడపోయనుంది.

Spread the love