శివ నామస్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం

– హర హర మహాదేవ శంభో శంకర..!
– వేములవాడలో భక్తుల రద్దీ..
– ఎప్పటికప్పుడు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ..
– అధికారులకు సూచనలు..
నవతెలంగాణ – వేములవాడ
హర.. హర.. మహాదేవ శంభో శంకర.. ఓం నమశ్శివాయ.. ఓం నమశివాయ.. అంటూ వేములవాడ పట్టణం శివ నామస్మరణతో  మార్మోగుతుంది.. మహా శివరాత్రి  పర్వదినాన్ని పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు, ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా వేములవాడ ఎం.ఎల్. ఏ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు పరిశీలించి, నిర్వాహకులు, వాలంటీర్లను విప్ అభినందించారు.. అనంతరం స్వామి వారిని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ ఆవరణలో పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు చేశారు.
ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు: హైకోర్టు జడ్జి కె సురేందర్ కుటుంబ సభ్యులతో ఆలయానికి రాగా, ఈఓ కృష్ణ ప్రసాద్, ఏఈఓ లు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైకోర్టు జడ్జితోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, సబ్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జిలు ప్రవీణ్, జ్యోతిర్మయి, సుజన వారి కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోగా, వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారిని కరీంనగర్ ఎం ఎల్ ఏ గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.
అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్: మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్  అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ,క్యూ లైనలో ఉన్న భక్తులకు తో మాట్లాడుతూ వారికి ఇబ్బందులు ఉంటే సిబ్బందితో మాట్లాడుతూ సులభంగా దర్శనం అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
జాతరకు తరలివచ్చే వందలాది వాహనాల వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
సీసీ కెమెరాల నిఘా నీడలో మహాశివరాత్రి జాతర: శివరాత్రి జాతర సందర్భంగా దేవాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సుమారు 200 సీసీ కెమెరాలు, పట్టణ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అవాంతరాలు జరిగిన ప్రదేశాలలో ,ట్రాఫిక్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి సెట్ కమ్యూనికేషన్ద్వారా సూచనలు చేస్తూ ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రచారి,  ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, పట్టణ సిఐ కరుణాకర్ తో పాటు తదితరులు  పాల్గొన్నారు.
Spread the love