పాము విషంతో రేవ్‌ పార్టీ.. బిగ్‌బాస్‌ విన్నర్​పై కేసు!

నవతెలంగాణ – ముంబాయి: బిగ్​బాస్ ఓటీటీ (హిందీ) సీజన్-2 విన్నర్ ఎల్విశ్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఎల్విశ్​పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. పాము విషంతో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే..? ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఓటీటీ (హిందీ) సీజన్‌-2 విజేత ఎల్విశ్‌ యాదవ్‌ పాము విషంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. నొయిడా.. సెక్టార్‌ 49లో జరుగుతున్న ఓ రేవ్‌ పార్టీపై గురువారం రోజున పోలీసులు దాడి చేసి ఐదుగురు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 పాములతో పాటు పార్టీలో 20 మిల్లీ లీటర్ల పాము విషాన్ని కూడా గుర్తించి సీజ్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన వారిని ప్రశ్నించగా.. ఎల్విశ్‌ పేరు బయటకొచ్చిందని యూపీ పోలీసులు తెలిపారు. ఎల్విశ్‌ నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని అరెస్టయిన వారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన విషయం బయటకు రాగానే ఎల్విశ్‌ పరారయ్యాడని.. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

Spread the love