ప్రొఫెసర్ కొండా నాగేశ్వర రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంబేద్కర్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని ప్రొఫెసర్ కొండా నాగేశ్వర రావు అన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రాజ్యాంగ విలువలు -ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులు’ అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు.
నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత పౌరుల హక్కులు, గౌరవ మర్యాదలను పరిరక్షించేందుకు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రక్షణలను వివరించారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ రాజకీయాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ”ట్రేడ్ యూనియన్ సభ్యులుగా ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్ని అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టడం మనందరి బాధ్యత” అని స్పష్టం చేశారు. కేవలం అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా జరుపుకోవడం వల్ల ప్రయోజనం లేదనీ, పౌరుల్లో విస్తృతంగా రాజ్యాంగ అవగాహన కల్పించినప్పుడే ఆ వేడుకలకు సార్థకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ కలలుగన్న న్యాయమైన, సమానమైన, మానవీయ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఎల్ఐసీ ఉద్యోగులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



