ప్రాణాలు తీసిన రూ.వంద

నవతెలంగాణ హైదరాబాద్: రూ.వంద విషయంలో తలెత్తిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గంపలబస్తీలో ఈనెల 9న జరిగిన కూలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై హరీశ్‌, ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావులతో కలిసి బాలానగర్‌ ఏసీపీ హన్మంతరావు వివరాలు వెల్లడించారు. రసూల్‌పురకి చెందిన యాసిన్‌ బేగ్‌(45), పశ్చిమబెంగాల్‌కి చెందిన ఫేకుఖాన్‌ గంపలబస్తీలో అద్దెకుంటున్నారు. ఈ నెల 9న ఇద్దరు కలిసి మద్యం తాగి ఇంటికి వెళ్తుంటే మధ్యలో బైక్‌లో పెట్రోల్‌ అయిపోయింది. ఇద్దరూ కలిసి ఇంటి వరకు నెట్టుకుంటూ వచ్చారు. గదిలో మద్యం తాగుతుండగా.. తన వల్లే పెట్రోల్‌ అయిపోయిందని రూ.100 ఇవ్వాలని ఫేకుఖాన్‌ని యాసిన్‌బేగ్‌ అడగటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన ఫేకుఖాన్‌ కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులకు విషయం తెలిసిందని గమనించి సొంతూరుకు పరారయ్యాడు. ఎస్సై హరీశ్‌ బృందం పశ్చిమబెంగాల్‌ వెళ్లి నిందితుడిని పట్టుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.

Spread the love