నవతెలంగాణ- భువనగిరి రూరల్
గ్రామాలలో పారిశుధ్య పనులు పక్కాగా, నిరంతరం జరుగుతుండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు జీ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నాడు ఆయన మోటకొండూరు మండలంలోని ఆరెగూడెం, గిరిబోయినగూడెం, సికిందర్ నగర్, మోటకొండూరు గ్రామాలలో, అనంతరం ఆత్మకూర్ ఎం. మండలం రాయిపల్లి, ఆత్మకూరు గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్య పనులను పరిశీలించారు. నర్సరీలను పరిశీలించి ఇంటి అవసరాలకు ఉపయోగపడే మొక్కలను పెంచాలని, మొక్కల ఎదుగుదలను పరిశీలించాలని, అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలకు వాటరింగ్ చేపట్టాలని, వంద శాతం మొక్కలను సంరక్షించాలని తెలిపారు. త్రాగునీరు వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని, పైల్ లీకేజీలను అరికట్టాలని, నీరు వృధాగా పోరాదని, ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని తెలిపారు. అనంతరం మండల అభివృద్ది కార్యాలయాలలో జరుగుతున్న దరఖాస్తుల డేటా ఎంట్రీ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమాలలో మండల అభివృద్ధి అధికారులు వీరాస్వామి, ఎండి నిరంజన్, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.