సావిత్రిబాయి పూలే పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొవాలి 

– ఎస్ ఎఫ్ ఐ సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
నవతెలంగాణ-వీర్నపల్లి : నేటితరం యువత విద్యార్థులు సావిత్రిబాయి పూలే పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. వీర్నపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధ వారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ మనుధర్మం రాజ్యమేలుతున్న రోజుల్లో నిమ్న బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా అనగారిన వర్గాలకు చదువుకోవడానికి నిషేధించిన కాలంలోనే చదువు యొక్క ప్రాముఖ్యత, చదువు అనగారిన వర్గాలను ఎలా పైకి తీసుకువస్తుందని అవగాహనతోనే జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే చదువు నేర్పి పాఠశాల నెలకొల్పి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి గా తీర్చిదిద్దారన్నారు. ఫూలే గారి స్త్రీ పురుష సమానత్వ, ఆత్మగౌరవ, కుల నిర్మూలన పోరాటాల ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి హక్కులను రాజ్యాంగం ద్వారా పొందగలిగామన్నారు , ఆ కాలంలో ఉన్నటువంటి నిమ్న వర్గాలకు విద్యపై నిషేధం నిర్బంధం ఇప్పుడు లేకపోయినప్పటికీ చదువును మార్కెట్లో సరుకులాగా వస్తువుగా ఈ ప్రభుత్వాలు మార్చాయన్నారు. విద్యా ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణకు కేంద్ర ప్రభుత్వ కాషాయీకరణకు వ్యతిరేకంగా అసమానతలు లేని కామన్ స్కూల్ విద్యా విధానం అమలుకై పూలే ఆశయాలను వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం యువత విద్యార్థులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ , నాయకులు వేణు, ఎస్ ఎం సి చైర్ పర్సన్ కళా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love