సంచలన సర్వే.. తెలంగాణలో ఆ పార్టీదే అధికారం

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. కొందరు టిక్కెట్ల కోసం ఒక పార్టీని వదిలి మరో పార్టీలో జయిన్ అవుతున్నారు. మరోవైపు ప్రచారంలో పార్టీల మధ్య మాటల వేడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా లోక్‌పోల్ సంస్థ విడుదల చేసిన సర్వే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం అంటూ సర్వే వెల్లడించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలో గుండెలో గుబులు పుట్టిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 10 నుండి సెప్టెంబరు 30 వరకు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌పోల్ సంస్థ సర్వే నిర్వహించి ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించింది. దీంతోపాటు ఓట్ షేర్‌ను కూడా ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 స్థానాలు వస్తాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అధికార పార్టీ బీఆర్ఎస్‌ 45 నుంచి 51 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని లోక్‌పోల్ సంస్థ సర్వే అంచనా వేసింది. బీజేపీ మాత్రం 2 నుంచి 3 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని తెలిపింది. ఎంఐఎం పార్టీకి 6-8 స్థానాలు వస్తాయని.. ఇతరులు 0-1 స్థానాలు దక్కించుకుంటారని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 41-44% ఓట్లు వస్తాయని.. బీఆర్ఎస్ పార్టీకి 39-42% ఓట్లు, బీజేపీకి 10-12% ఓట్లు, ఎంఐఎం 3-4%, ఇతరులు 3%-5% ఓట్లు కైవసం చేసుకుంటారని లోక్‌పోల్ సంస్థ సర్వేలో పేర్కొంది. తాజాగా  కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ పథకాలు ప్రజలపై ప్రభావం చూపిస్తున్నాయని లోక్‌పోల్ సర్వే తెలిపింది. బీసీలు, మైనారిటీల్లో కాంగ్రెస్ పార్టీకి అదరణ పెరుగుతోందని పేర్కొంది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం, స్థానిక నేతలపై ప్రజల అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని లోక్‌పోల్ తన సర్వే ద్వారా వెల్లడించింది. సీఎం కేసీఆర్‌పై గ్రామస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోందని అభిప్రాయపడింది. రైతులు, నిరుద్యోగుల్లో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించింది. అటు పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంది. బీజేపీ మాత్రం తెలంగాణలో భారీగా ఓట్ బ్యాంకును కోల్పోయింది. కాగా గతంలో కర్ణాటక ఎన్నికల్లో లోక్‌పోల్ సర్వే అక్షరాలా నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 129-134 స్థానాలు, బీజేపీకి 59-65 స్థానాలు వస్థాయని లోక్ పోల్ సర్వే తెలిపింది.

Spread the love