నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొన్న ఘటనపై ఆయన ఆరా తీశారు. ప్రమాద తీవ్రత, క్షతగాత్రుల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు తరలించాలని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.



