వనపర్తి డీటీఓను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-పెబ్బేరు
పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రోజువారీగా సేవలు అందేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) సురేష్ కుమార్ ని పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెబ్బేరులోని మోటార్ యూనిట్ ఆఫీస్కు చాలా కాలంగా రెగ్యులర్ అధికారి లేకపోవడం, రోజువారీగా కార్యాలయంలో సేవలు కొనసాగక పోవడంతో వాహనదారులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డిటిఓ దృష్టికి తీసుకెళ్లారు.
దీనివల్ల లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర రవాణా శాఖ సేవల కోసం ప్రజలు వనపర్తికి వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, ధనం వృథా అవుతోందని వివరించారు. కావున పెబ్బేరు మోటార్ యూనిట్ ఆఫీస్కు వెంటనే రెగ్యులర్ అధికారిని నియమించి ప్రజలకు సేవలు రోజువారీగా సేవలు అందుబాటులో ఉంచాలని డీటీఓను కోరారు. దీనిపై డీటీఓ సురేష్ కుమార్ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో వెంకటేష్ సాగర్ రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



