నవతెలంగాణ – ముంబయి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. నవభారత నిర్మాణం కోసం మాజీ ప్రధానులు కృషి చేస్తే.. ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా అమరావతిలో ఏర్పాటుచేసిన ప్రచారంలో పాల్గొన్న శరద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చడం గురించి కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ప్రధాని ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరును అనుకరిస్తున్నారు. భారత్లో మరో పుతిన్ తయారవుతున్నారు. ఇది ఆందోళనకరం. దేశంలో నిరంకుశ పాలనను మీరంతా అనుమతించొద్దు’’ అని ప్రజలను కోరారు.