సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్

ఈనెల 15 నుండి బందుకు నిర్ణయం
– వీధినపడనున్న కార్మిక కుటుంబాలు
నవ తెలంగాణ –  సిరిసిల్ల
సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను ఈ నెల 15 నుండి నిరవధకంగా బంద్ చేసేందుకు పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. సిరిసిల్లలోని పాలిస్టర్ యజమానుల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పరిశ్రమను బందు చేస్తున్నట్లు ప్రకటించింది. యజమానుల నిర్ణయంతో ఆసాములు ,కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు అయోమయానికి గురయ్యారు. ఇది సరైన విధానం కాదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వస్త్ర పరిశ్రమ బందును ఆపాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పడం లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. గోడౌన్లలో గుడ్డ నిల్వలు ఇప్పటికే లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్ లలో పేరుకుపోయింది. కొత్తగా నూలు దారాన్ని కొని, వస్రోత్పత్తిని కొనసాగించే పరిస్థితిలో లేమని పాలిస్టర్ యజమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకు బకాయిలు గత ప్రభుత్వం నుండి రాకపోవడంతో యజమానులు కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంధు నిర్ణయంతో వేలాదిమంది పవర్లూమ్, నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడనున్నారు. ఇప్పటికే బతకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటినుండి సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకోడిగా కొనసాగుతోంది. పరిశ్రమలో చేతినిండా పని లేక కార్మికులు చాలినంత ఉపాధిని పొందలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న పవర్లూమ్ కార్మికుల జీవితాలను తీవ్రంగా ప్రభావం చేయనుంది. రోజువారి వేతనాలతో పనిచేసే నేత కార్మికులు పరిశ్రమ బంద్ అయితే ఉపాధి లేక వీధినపడనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి సిరిసిల్ల పవరలూమ్ పరిశ్రమకు అందించే ఆర్డర్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఆర్డర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి తమకు ఏ ఆర్డర్లు అందలేదని పరిశ్రమల యజమానులు తెలిపారు. మరోవైపు కేవలం 600 లోపు మర మగ్గాలు నడిచే టెక్స్టైల్ పార్కుకు, 25 వేలకు పైగా మరమగ్గలు నడిచే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమానంగా ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడం పట్ల కూడా సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రాకుంటే పరిశ్రమలు నడపలేమని యజమానులు స్పష్టం చేస్తున్నారు.
రోడ్డున పడనున్న కార్మికులు
– ఎం రమేష్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు : పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బందు చేస్తే వేల కుటుంబాలు, కార్మికులు రోడ్డున పడే పరిస్తితి ఉందని పవర్లూమ్ యజమానులు పాలిస్టర్ బట్టకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని బందు పెట్టడం సరికాదని, యజమానులు జౌలి శాఖ అధికారులను ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా మాట్లాడుకోవాలని, దీనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని, మళ్లీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారే అవకాశం ఉందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం కల్పించుకొని పవర్లూమ్స్ యధావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మరమగ్గాలు బందు చేయడం సరైంది కాదు
– లక్ష్మణ్, మరమగ్గాల కార్మికుడు : 30 సంవత్సరాల నుంచి పవర్ లూమ్స్ నడుపుతున్నాను. ఎన్నడూ లేని విధంగా ఈనెల 15 నుండి నిరవధికంగా యజమానులు బందు పెట్టడం సరికాదు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మేము జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది. మా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. యజమానులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూసుకొని సాంచలు నడిచేల చర్యలు తీసుకోవాలి.
Spread the love