రైల్వే ప్రమాదాలపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

నవతెలంగాణ – ఢిల్లీ :  రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాలను నివారించేందుకు అమలు చేస్తున్న.. లేదంటే అమలు చేయడానికి ప్రతిపాదించిన నివారణ చర్యలపై ఇవ్వాలని ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. రైలు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ చేపట్టింది. పిటిషన్ కాపీని అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించాలని పిటిషనర్ విశాల్ తివారీకి ధర్మాసనం సూచించింది. ఆ తర్వాత కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గతేడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై పిటిషనర్‌ ప్రస్తావించారు. రైళ్లు ఢీకొనకుండా నిరోధించడానికి ప్రభుత్వం అనేక భద్రతా వ్యవస్థలను ప్రవేశపెట్టిందని, అయినప్పటికీ గత సంవత్సరంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. భారతదేశమంతటా కవచ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఏదైనా కసరత్తు జరిగిందా? అని బెంచ్‌ ప్రశ్నించింది. ప్రతీదానికి ఆర్థిక అంశంతో పరస్పర సంబంధం ఉందని.. ఎందుకంటే అంతిమ భారం ప్రయాణికులపైనే ఉంటుంది. రైల్వేలో రిస్క్‌, సేఫ్టీ పారామితులను విశ్లేషించేందుకు, సమీక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి అధ్యక్షతన సాంకేతిక సభ్యులతో కూడిన నిపుణుల కమిషనర్‌ ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు.

Spread the love