కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలంపై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్

Rahul Dravidనవతెలంగాణ – హైదరాబాద్
టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను తిరిగి కొనసాగించనున్నట్టు బీసీసీఐ ఈ మధ్యే అధికారికంగా ప్రకటించింది. కోచ్‌తోపాటు ఆయన స్టాఫ్‌ కాంట్రాక్టును కూడా పొడగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఎంతకాలంపాటు పొడగించారన్నది చెప్పలేదు. ఈ కారణంగా అధికారిక పత్రాలపై రాహుల్ ద్రావిడ్ ఇంకా సంతకం కూడా చేయలేదు. దాదాపు నెలన్నర రోజుల నుంచి ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ బీసీసీఐ సెక్రటరీ జై షా కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని భారత్ తిరిగొచ్చాక ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని నిర్ణయిస్తామని జై షా స్పష్టం చేశారు. కోచ్‌గా తిరిగి కొనసాగించేందుకు అంగీకారం తెలిపామని, అయితే ఇంకా ఒప్పందాన్ని ఖరారు చేయలేదని, ఈ విషయంపై చర్చించేందుకు సమయం దొరకలేదని పేర్కొన్నారు. ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత కోచ్ ద్రావిడ్, సిబ్బందితో సమావేశమయ్యానని, కొనసాగేందుకు పరస్పరం అంగీకారం లభించిందని వివరించారు. జట్టు దక్షిణాఫ్రికా నుండి తిరిగొచ్చాక కూర్చుని మాట్లాడుకుంటామని, పదవీకాలం పొడగింపుపై నిర్ణయం తీసుకుంటామని జై షా పేర్కొన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికా టూర్‌లో టీమ్ ఇండియా ఆరంభమవనున్నాయి.

Spread the love