నవతెలంగాణ – హైదరాబాద్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు రేపటితో తెరలేవనుంది. అయితే.. మ్యాచ్కు సన్నద్ధమవుతున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. అతడి ఎడమచేతి బొటన వేలికి చిన్నపాటి గాయం అయింది. బ్యాటింగ్ చేస్తుండగా బంతి బొటన వేలికి బలంగా తాకింది. దాంతో కాసేపు నొప్పితో బాధపడ్డాడు. వెంటనే సహాయ సిబ్బంది అతడి వేలికి బ్యాండేజీ వేశారు. గాయం చిన్నదే అయినప్పటికీ రోహిత్ ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేశాడు. గాయం తీవ్రత ఎక్కువ కాకూడదనే ఆలోచనతో అతను నెట్స్ నుంచి వెళ్లి పోయాడు. దాంతో, కీలక పోరుకు హిట్మ్యాన్ దూరం అవనున్నాడా? అని ఫ్యాన్స్ అందోళన పడుతున్నారు. అయితే… అతడి గాయంపై ఈ రోజు మేనేజ్మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రాక్టీస్కు ఒక్క రోజే మిగలడంతో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో రేపు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. దాంతో, ఈ రోజు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ఫొటో సెషన్లో పాల్గొన్నారు.