అమెరికాలో కోకా-కోలా గ్రూప్ డైరెక్టర్ తో సమావేశమైన తెలంగాణ మంత్రులు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు  దుద్ధిల్ల శ్రీధర్ బాబు , రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అట్లాంటాలోని కోకా-కోలా హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్ తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా-కోలా మేనేజ్ మెంట్ ను ఆహ్వానించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని కోకా-కోలా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. భారత దేశంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని మంత్రుల బృందం జోనథన్ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన జోనథన్ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  జయేష్ రంజన్  పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు ఇతర బృందం పాల్గొన్నారు.
Spread the love