నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది. నీటిపారుదల, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ శాఖలకు 30శాతం అధికంగా ఖర్చు చేసిందని తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని పేర్కొంది. 11గ్రాంట్లకు రూ.75వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందని వివరించింది. ‘‘289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. 100రోజుల పాటు రూ.22,669 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్కు ప్రభుత్వం వెళ్లింది. 259 రోజులపాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యం వినియోగించుకుంది. 2020-21లో రెవెన్యూలోటు రూ.9,335 కోట్లుగా ఉంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 44శాతం తగ్గాయి. రెవెన్యూ రాబడుల్లో 50శాతం వేతనాలు, వడ్డీలకే చెల్లిస్తుంది. 2021-22 వరకు రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పు జీఎస్డీపీలో 27.40%గా ఉంది. పెరుగుతున్న జీఎస్డీపీకి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదు’’ అని కాగ్ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు శాసన మండలిలో టిమ్స్ బిల్లు, శాసనసభలో వస్తు, సేవల బిల్లు ఆమోదం పొందాయి.