వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘శబరి’ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం… ఐదు భాషల్లో విడుదల చేశారు. ‘శబరి’కి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమతా సురేష్ పాడారు. ‘శబరి మ్యూజిక్’ ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది.
‘నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా…
మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా…
ఓ కొత్త లోకం చేరి తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా..’ అంటూ సాగిందీ గీతం. వరలక్ష్మీ శరత్ కుమార్, సినిమాలో ఆమె కుమార్తెగా నటించిన నివేక్ష మీద ఈ పాటను తెరకెక్కించారు. కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాట చిత్రీకరణ చేశారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ, ‘ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఆమె తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. తల్లీ కూతుళ్ళ మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మే 3న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు.