చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘తురుమై వచ్చేరు..’ లిరికల్ సాంగ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. ‘తురమై వచ్చేరు..’ పాట రిలీజ్ చేశాను. ఈ పాట వినగానే నచ్చేలా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘ఈ పాటకు సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమస్యను ఎదిరించే క్రమంలో హీరో ఎలాంటి తెగువ చూపించాడు అనేది ఈ పాటలో ఇన్స్పైరింగ్గా తెరకెక్కించారు’ అని హీరో చైతన్య రావ్ చెప్పారు. దర్శకుడు కుమార స్వామి మాట్లాడుతూ, ‘సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించాం. మా సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’ అని తెలిపారు. ‘తురుమై వచ్చేరు..’ పాటకు పసునూరి రవీందర్ లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. ‘తురుమై వచ్చేరు, మెరుపే తెచ్చెరు, తొడగొట్టి దమ్ము చూపి దుమ్ములేపెసేరు, పదునే పెట్టేరు, కఢరే చూపెరు, బరిదూకి ధూమ్ తడాఖా ఆట కట్టించెరు, జనమంతా ఆదరిస్తే, ఏలేటి ఆ గద్దె నీ విద్దె కాదా, పవరుంటె ఎవ్వరైనా తలొంచి నీ చెంత గులాము కారా..’అంటూ నిరాశ నిండిన వారిలో స్ఫూర్తినింపేలా సాగుతుందీ పాట అని చిత్ర బృందం తెలిపింది.