పోలింగ్ రోజున భారీ వర్షాలు!

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. రేపటితో ప్రచార గడువు ముగియనుంది. ఈనెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ స్థానంలో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? అనే చర్చ సాగగా.. ఇప్పుడు మాత్రం అసలు పోలింగ్ సజావుగా జరుగుతుందా? పోలింగ్ ఎంత శాతం నమోదవుతుంది? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే పోలింగ్ రోజున తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించడమే దీనికి కారణం. పోలింగ్ రోజున రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సరిగ్గా పోలింగ్ రోజున వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్ వంటి చోట్ల సాధారణ రోజుల్లోనే పోలింగ్ తక్కువగా నమోదవుతూ ఉంటుంది. వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టం మొత్తం వృథా అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Spread the love