నవతెలంగాణ – హైదరాబాద్: అసోంలో తన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్న సీఎం హిమాంత బిశ్వశర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాంత బిశ్వశర్మ దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని ఆయన మండిపడ్డారు. అసోం ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందన్నారని తెలిపారు. అవినీతి తీవ్రంగా ఉన్నదని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, రైతులు సమస్యలతో సతమతమవుతున్నారని, యువతకు ఉద్యోగాలు కరువయ్యాయని ప్రజలు చెప్పినట్లు వెల్లడించారు. ఈ అంశాలనే తాము లేవనెత్తుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో తాము విజయవంతంగా పనిచేశామని చెప్పారు.