నేడు రాజీవ్‌ గాంధీ జయంతి.. రాహుల్‌ గాంధీ భావోద్వేగమైన పోస్ట్‌

నవతెలంగాణ- ఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి(79వ) నేడు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు రాజీవ్‌కు  నంగా నివాళులర్పిస్తున్నాయి.  లడ్డాఖ్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ.. పాంగోంగ్ సరస్సు తీరం వద్ద తన తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. మరోవైపు ఢిల్లీలోని వీర్‌ భూమి వద్ద  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  రాజీవ్‌ సతీమణి  సోనియా గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా.. ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా  నివాళులర్పించారు.అదే సమయంలో ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ ఓ భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. ‘‘నాన్నా.. దేశం కోసం మీరు కన్న కలలు.. అమూల్యమైన జ్ఞాపకాలు. ప్రతీ భారతీయుడి కలల్ని, కష్టాల్ని అర్థం చేసుకోవడం, అన్నింటికి మంచి భరత మాత గొంతుక వినాలని మీరు పడ్డ తపన ఇవాళ నన్ను మీ బాటలో నడిచేలా చేస్తోంది’’ అంటూ పేర్కొన్నారు. ఇక లేహ్‌ వద్ద జమ్ము కశ్మీర్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ సభ్యులు సైతం రాజీవ్‌కు నివాళులర్పించారు. 1944 ఆగష్టు 20వ తేదీన జన్మించిన రాజీవ్‌ గాంధీ.. భారత దేశానికి ఏడవ ప్రధానిగా (1984 నుంచి 1989) దాకా సేవలందించారు.

Spread the love