లైంగిక దాడులకు పాల్పడిన వారిపై వెంటనే శిక్షలు అమలు చేయాలి

– జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆడపిల్లలను వేధించి, లైంగిక దాడులు జరిపే నిందితులకు వెంటనే శిక్షలు చేయాలని, నిందితులకు మరొకసారి ఇలాంటి అరాచకాలు చేయాలంటే వణుకు పుట్టే విధంగా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇటీవల మైనర్‌ బాలికలపై జరిగిన లైంగిక దాడుల విషయంలో ఆమె తీవ్రంగా స్పందించారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన కామాంధులకు వెంటనేశిక్ష అమలు చేయాలన్నారు. న్యాయవ్యవస్థలోని లోపాలను సవరించాలని, అభాగ్యులను ఆదుకుని, నిందితులను శిక్షించాలని కోరారు. మణుగూరులో జరిగిన సంఘటన, పెద్దపెల్లి జిల్లా, సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని రైస్‌ మిల్లులో గురువారం అర్ధరాత్రి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని వెంటనే శిక్షించాలన్నారు. బీహార్‌కి చెందిన వినోద్‌ అనే నిందితుడు నేరానికి ముందు బాలికను ఎత్తుకెల్తున్న దృశ్యం సీసీ టివి కెమెరాలకు చిక్కిందని, పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం బాలిక కుటుంబానికి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శిలు పొదిలి జ్యోతి, పందాల సరిత, బోడ దివ్య, మహిళా కాంగ్రెస్‌ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ సున్నం లక్ష్మి, మహిళా కాంగ్రెస్‌ మండల పట్టణ అధ్యక్షురాలు కృష్ణవేణి, పద్మశ్రీ, నాగోలు శ్రీలక్ష్మి, శారద, సావిత్రి, విజయలక్ష్మి, సుశీల, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love