రైఫిల్ తో డీజేను కాల్చి చంపిన దుండగుడు..

నవతెలంగాణ-హైదరాబాద్ : జార్ఖండ్ రాజధాని రాంచీలో ఘోరం జరిగింది. ఓ దుండగుడు ఏకంగా రైఫిల్ తో బార్ లోకి వచ్చి అక్కడ డీజేగా పనిచేస్తున్న యువకుడిని కాల్చి చంపడం కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది. పోలీసుల కథనం ప్రకారం రాంచీలోని ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్స్ బార్ లో మద్యం మత్తులో ఉన్న మందుబాబులకు, బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. అమ్మాయిలను వేధించారనే విషయంపై రెండు గ్రూపుల వారు పరస్పరం కొట్టుకున్నారు. దీంతో ఓ గ్రూప్ లోని వ్యక్తులు ఈ సమాచారాన్ని తమ స్నేహితులకు అందించడంతో వారు కర్రలతో దాడి చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో బార్ లో రోజువారీ జీతానికి పనిచేస్తున్న సందీప్ అనే డిస్క్ జాకీ (డీజే)పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ముఖం కనిపించకుండా టీషర్ట్ చుట్టుకున్న దండగుడు అతిదగ్గర నుంచి సందీప్ ను కాల్చాడు. దీంతో ఆ యువకుడు కుప్పకూలి పడిపోయాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సందీప్ ను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై రాంచీ ఎస్ ఎస్పీ చందన్ కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ అనంతరం మొత్తం ఆరు బుల్లెట్లు ఫైర్ అయ్యాయని చెప్పారు. తమ దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మరోవైపు బార్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. కానీ ఇప్పటివరకు నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన నిపుణులు ఘటనాస్థలికి చేరుకొని అక్కడి ఆధారాలను సేకరించారు.

Spread the love