విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
విద్యార్థి మృతికి కారణమైన అధ్యాపకురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. గద్వాల మండలం కొత్తపల్లి గ్రామనికి చెందిన తరుణ్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ (బైపీసీ) చదివాడు. విద్యార్ధి తరుణ్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. తరుణ్.. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు 434 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. అయితే కళాశాలకు చెందిన ఒక అధ్యాపకురాలు తనను ఎంకరేజ్ చేయకుండా అవమానపరుస్తూ తోటి విద్యార్థుల ముందు తక్కువ చేసి మాట్లాడిందని, అందుకు ఆవేదన చెంది ఉరివేసుకొని చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే విద్యార్థి మృతికి కారణమైన అధ్యాపకురాలిని శాశ్వతంగా తొలగించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిండంతో పాటు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన లెక్చరర్స్ వేధింపులకు గురిచేస్తూ ర్యాగింగ్ చేయడం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అన్నారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలేజీలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా నోడల్ అధికారి నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రతి కాలేజీలో తల్లిదండ్రులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రతి నెలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



