తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, వినతి
నవతెలంగాణ-పెనుబల్లి
పోడు సాగులో ఉన్న బీసీ దళిత మైనార్టీ, గిరిజనేతర పేదలకు హక్కు పత్రాలు వచ్చేవరకూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాస్ రావు అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోడు రైతుల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ వీరభద్ర నాయక్కు వినతిపత్రం అందజేశారు. ముందుగా వీఎం బంజరా చలమాల సూర్యనారాయణ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. దేశంలో 80 శాతం పైగా ఉన్న దళిత, గిరిజన, బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి కాంక్షించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు.
వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్టుల పోరాటలతోనే అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి పేదలకు ఉపయోగపడే చట్టాలను సాధించుకున్నామని తెలిపారు. కానీ నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రూపుమాపేందుకు కుట్ర పన్నుతోందన్నారు. కార్పొరేట్ సంస్థలకు భూములను కారు చౌకగా కట్టబెడుతూ పేద ప్రజలకు భూములు దక్కకుండా ప్రభుత్వం నిరంకుశ విధానానికి అద్దం పడుతుందన్నారు. పోరాట ఫలితంగా 4000 ఎకరాలకే పాలకులు పట్టాలు ఇచ్చి సరిపెట్టారని, ఇంకా పేదల సాగులో ఉన్న 14 వేల ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా భూములకు హక్కు పత్రాలు వచ్చేవరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాస సత్తుపల్లి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు తన్నీరు కృష్ణార్జునురావు, జాజిరి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా నాయకులు, శీలం సత్యనారాయణ రెడ్డి, చిట్టి మొదల కృష్ణయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెమట విశ్వనాథం, గుడిమెట్ల బాబు, రాజనేని మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



