హమాస్‌తో యుద్ధం చేసేందుకే..

హమాస్‌తో యుద్ధం చేసేందుకే..– ఉద్యోగాల వంకతో ఇజ్రాయిల్‌కు భారతీయులు : కేంద్రంపై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశంలో గ్రామీణ పేదరికం పెరిగినందువల్ల ఉద్యోగాలులేని వారిని ఆ యుద్ధం కోసం ఇజ్రాయెల్‌కు పంపించాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశంలో గ్రామీణ కష్టాలు తీవ్రంగా ఉన్నాయని, అందువల్ల జరుగుతున్న యుద్ధంలో ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గడచిన ఐదేండ్లలో వ్యవసాయం (-0.6 శాతం), వ్యవసాయేతర (-1.4 శాతం) రంగాలు రెండూ ప్రతికూలతల్ని ఎదుర్కొన్నాయి. దీంతో గ్రామీణ పేదరికం పెరిగింది. దేశంలో 2014లో పురుషుల రోజువారీ వేతనం రూ. 220గా ఉంది. అదే 2022-2023లో 212గా ఉంది. ఉద్యోగాల కల్పన 30 నెలల కనిష్టానికి పడిపోయింది. దీంతో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కింద పనికోసం డిమాండ్‌ రోజురోజుకి పెరుగుతున్నది. మోడీ ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో నిధులను తగ్గించింది. కానీ గ్రామీణ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నందున రూ. 28,000 కోట్లు కేటాయించవలసి వచ్చింది. 14వ ఆర్థిక సంఘం (2015- 2020)లో వాగ్దానం చేసిన దానికంటే పంచాయతీలకు వాస్తవ నిధుల పంపిణీ 10.4 శాతం తక్కువగా ఉంది. అంతేకాకుండా, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాలు గతేడాది (2023)లో ఎటువంటి పెరుగుదల లేదు. గృహాల పొదుపులు 50 ఏండ్ల కనిష్ట స్థాయికి వెళ్లాయి. ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కల్పన 21 సంవత్సరాల కనిష్టంగా ఉంది. 2018-19, 2022-23 మధ్య ప్రజల నుంచి వ్యక్తిగత పన్ను వసూళ్లు 50.55 శాతం పెరిగాయి. అయితే కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 2.72 శాతం మాత్రమే పెరిగాయి. ఇవన్నీ ఆర్థిక అసమానతల్ని తెలియజేస్తోందని, గతేడాది కూరగాయల ధరలు 60 శాతం పెరిగి ప్రజలపై పెనుభారం మోపాయని ఖర్గే అన్నారు. ఇంకొద్దిరోజులే మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండనుంది. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌.. మోడీ ప్రభుత్వపు చివరి బడ్జెట్‌ అని ఖర్గే అన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల భర్తీకి భవన నిర్మాణ కార్మికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించాయి. కేంద్ర ప్రభుత్వం కనీసం పదివేల మంది కార్మికులను అక్కడకు పంపాలని యోచిస్తోంది. ఈ కార్మికులను నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) ఎంపిక చేస్తుంది. ఇజ్రాయెల్‌కు ఉత్తరప్రదేశ్‌, హర్యానాల నుండి పంపే కార్మికుల కోసం చట్టపరమైన చర్యలకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఈ నెల ప్రారంభంలో అన్నారు.

Spread the love