పారదర్శకంగా దళితబంధు

– అమలుపై అపోహలొద్దు :మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. శుక్రవారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లబ్ది దారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. మొదటి దశలో ఎమ్మెల్యేల సూచనలనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టడంపై అపోహలు వచ్చాయని తెలిపారు. దీంతో.. కలెక్టర్లకే ఆ బాధ్యత అప్పగించామన్నారు. సంబంధిత జిల్లా మంత్రులు కలెక్టర్లతో కలిసి లబ్దిదారుల ఎంపికపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దళిత బంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన రూ. 17 వందల కోట్ల నిధుల్లో ఇప్పటికే రూ. 850 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికీ పథకాన్ని వర్తింపజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. విద్య, వైద్య పరంగా అట్టడుగు వర్గాల పేదల కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. స్వాతంత్య్రానంతరం నుంచి కూడా అంటరానితనానికి, వివక్షకు గురైన దళిత కుటుంబాల్లో మార్పులు తేవాలన్న లక్ష్యంతో దళితబంధుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జ కూడా పాల్గొన్నారు.

Spread the love