– డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. వచ్చేనెల 15న టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఎన్నికల కోడ్ వచ్చేలోపు టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా 10 వేల ఉపాధ్యాయ పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆయా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ త్వరగా అనుమతి ఇచ్చి ఎన్నికల కోడ్ వచ్చే లోపే నోటిఫికేషన్ జారీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.