ములుగులో డెంగ్యూతో ఇద్దరి మృతి

నవతెలంగాణ – మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలంలో డెంగ్యూతో ఇద్దరు, విష జ్వరంతో ఒకరు మృతి చెందారు. రమణక్కపేటకు చెందిన చిన్నారి వీర్ల మాధురి(9) వారంపాటు తీవ్ర జ్వరంతో బాధపడగా మణుగూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల తర్వాత బాలికకు డెంగీ ఉందని నిర్ధారించారు. వైద్యం పొంది ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలు కావడంతో శనివారం రాత్రి హనుమకొండకు తీసుకెళ్తుండగానే మాధురి కన్నుమూసింది. కమలాపురం ఒరిస్సాకాలనీకి చెందిన రేషన్‌ డీలర్‌ బోయి సపుర(45) జ్వరంతో బాధపడుతుండగా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో చూపించగా డెంగ్యూగా తేలింది. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా ఆదివారం మృతిచెందారు. అదే కాలనీకి చెందిన బోయి చినబాబు(45) జ్వరంతో బాధపడగా వైద్య పరీక్షల తర్వాత వైరల్‌ ఫీవర్‌గా తేలింది. చికిత్స పొందుతుండగా జ్వరంతోపాటు బీపీ పెరిగి గుండెపోటు వచ్చి ఆదివారం మృతి చెందారు.

Spread the love