న్యూజిలాండ్‌పై పసికూన యూఏఈ సంచలన విజయం..

నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ కోలుకోలేని షాకిచ్చింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కివీస్‌పై యూఏఈకి ఇదే తొలి విజయం. అంతేకాదు, దుబాయ్‌లోనూ ఆ జట్టు గెలవడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. చాప్‌మన్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా బోవెస్, నీషమ్ చెరో 21 పరుగులు చేశారు. అనంతరం 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూఈఏ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ముహమ్మద్ వాసిమ్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. వృతియ అరవింద్ 25, అసిఫ్ ఖాన్ 48, బాసిల్ అహ్మద్ 12 పరుగులు చేశారు. మూడు వికెట్లు పడగొట్టిన యూఈఏ బౌలర్ ఆయన్ అఫ్జల్ ఖాన్ ‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Spread the love