– టీఎస్ బీపాస్ తో సులభతరంగా భవన నిర్మాణాలకు అనుమతులు
– సమీక్ష సమావేశంలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతులను ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన టీఎస్-బీపాస్ వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా ఉన్న చోట నుంచే ఆన్లైన్లో నమోదు చేసుకోవడంతో భవన నిర్మాణాల అనుమతులకు ఎంతో సౌలభ్యం కలిగిందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లతో టీఎస్-బీపాస్ పై అవగాహన, సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే జిల్లా, మండల కేంద్రాలకు వచ్చి సంబంధిత ఇంజనీర్లతో ప్లాన్ తీసుకొని వాటిని తీసుకెళ్లి గ్రామపంచాయతీలో నమోదు చేసుకొనేందుకు చాలా సమయం పట్టేదన్నారు. దీనిని దష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల టీఎస్–బీపాస్ తీసుకొచ్చిందన్నారు. దీని ద్వారా ఆన్లైన్లోనే సంబంధిత వివరాలను నమోదు చేయడంతో పాటు అప్పటికప్పుడు ఎంత రుసుము చెల్లించాలో ఆ చెల్లింపులు కూడా ఎలాంటి మధ్యవర్తి జోక్యం లేకుండా ఇంటి యజమాని నేరుగా చెల్లించేందుకు అవకాశం కల్పించిందని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 61 గ్రామపంచాయతీలు ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నెంబర్) 131, 135 వల్ల పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని మంత్రి తెలిపారు. పట్టణాలకు ధీటుగా పల్లెల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని.. మరింత అభివద్ధి పర్చి పల్లెల రూపురేఖలు మార్చి అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ళను ఇవ్వటానికి కషి చేస్తోందని పేర్కొన్నారు. దీనికి గాను 60 గజాల స్థలం మొదలుకొని 120 గజాల స్థలాల్లో ఇల్లు కట్టుకొనే వారికి ప్రభుత్వం నుంచి గహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు మంజూరు చేస్తుందని వివరించారు. ఈ విషయంలో ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల మందికి అనుమతులు వచ్చాయని అన్నారు. టీఎస్ బీపాస్ గురించి గ్రామాలలో విస్తతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్మిషన్ల వల్ల గ్రామాలలో పన్నులు (ట్యాక్సులు) వస్తాయని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ప్రతీ గ్రామంలో సర్పంచ్లు, సెక్రటరీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మంత్రి సూచించారు అలాగే రెండోవిడత దళితబంధు కోసం గ్రామాలలో కమిటీ వేసి మేడ్చల్ నియోజకవర్గంలో 1,100 మంది లబ్దిదారులకు ఈ పథకాన్ని అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బెస్త వెంకటేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.