యూఏఈకి సరఫరా 66.8 శాతం క్షీణత
ముంబయి : పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం భారత ఇంజినీరింగ్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరాన్పై చేస్తోన్న దాడులతో షిప్పింగ్ మార్గాల ముసివేత కారణంగా భారత ఇంజినీరింగ్ ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. ముఖ్యంగా భారత్కు రెండో అతిపెద్ద మార్కెట్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు ఏకంగా 66.8 శాతం క్షీణించి 237.4 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సౌదీ అరేబియాకు చేసే ఎగుమతులు కూడా 45 శాతం పతనమై 247.7 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. యూఏఈ ప్రధాన వాణిజ్య కేంద్రం కావడంతో అక్కడి గోదాముల ద్వారా ఇతర దేశాలకు జరిగే వ్యాపార కార్యకలాపాలపై ఈ భౌగోళిక ఉద్రిక్తతలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులు కొంత ఆశాజనకంగా నమోదయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో మొత్తం ఇంజినీరింగ్ ఎగుమతులు 4.86 శాతం పెరిగి 122.43 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తం వస్తువుల ఎగుమతుల్లో ఇంజనీరింగ్ రంగం వాటా 27.71 శాతానికి పెరగడం విశేషం. అమెరికాకు ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటితో పాటు జర్మనీ (14.6 శాతం), బ్రిటన్ (18.2 శాతం), చైనా (32.4 శాతం), దక్షిణ కొరియా (16.7 శాతం) వంటి దేశాల్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఇంజినీరింగ్ ఎగుమతుల్లో సింహభాగాన్ని ఆక్రమించింది. ఇందులో కార్లు, ద్విచక్ర వాహనాల ఎగుమతులు 23 నుంచి 24 శాతం వరకు వృద్ధితో మద్దతును అందించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
ఇంజినీరింగ్ ఎగుమతులకు యుద్ధం దెబ్బ
- Advertisement -
- Advertisement -



