డబ్ల్యూఎఫ్ఐపై
ఢిల్లీ హైకోర్టు మండిపాటువినేశ్ అర్హతపై
నిపుణుల కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రీ ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకునేందుకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నూతన నిబంధనలను తీసుకొచ్చిందని ఎందుకు భావించకూడదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఎదురుచూస్తున్న వినేశ్ ఫోగట్కు డబ్ల్యూఎఫ్ఐ ఆరు నెలల నిబంధనతో అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయగా తొలుత సింగిల్ జడ్జి వినేశ్కు తక్షణ ఊరట అందించేందుకు నిరాకరించారు. ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై వినేశ్ అప్పీల్ చేయగా.. శుక్రవారం వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ డికె ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం వాదనల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మేటి రెజ్లర్లు నేరుగా ట్రయల్స్లో పోటీపడేందుకు గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య రూల్స్ అనుమతించాయి. వినేశ్ ఫోగట్ మాతృత్వ విరామం తర్వాత పునరాగమనం చేయాలని అనుకుంది. ఈ లోపు భారత రెజ్లింగ్ సమాఖ్య రూల్స్ మార్పు చేసింది. ఈ నిర్ణయాన్ని వినేశ్ ఫోగట్పై ప్రతీకారం తీర్చుకునేందుకు తీసుకున్నారని ఎందుకు అనుకోవద్దు? డబ్ల్యూఎఫ్ఐ, వినేశ్ మధ్య వివాదం ఏదైనా ఉండవచ్చు. కానీ ఈ వివాదంలో ఆటకు అన్యాయం జరగవద్దు. వినేశ్ ఫోగట్ అర్హతను తేల్చేందుకు నిపుణుల కమిటీ వేయండి. వినేశ్ ఫోగట్ ట్రయల్స్లో పోటీపడేలా చూడండి’ అని ద్వి సభ్య ధర్మాసనం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30,31న ఆసియా, కామన్వెల్త్ క్రీడల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది. హైకోర్టు ఆదేశాలతో వినేశ్ ఫోగట్ రీ ఎంట్రీకి మార్గం సుగమం కానుంది.
వినేశ్ కోసమే రూల్ మార్చారా?
- Advertisement -
- Advertisement -



