నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యంకాలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. మానసరోవర్ యాత్రలో ఉన్న సుమారు 200 మంది భారతీయులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. సద్గురుకు చెందిన ‘ఈషా ఫౌండేషన్’కు చెందిన ఒక పెద్ద బృందం కూడా ఆ హిమాలయ దేశంలో ఆచూకీ లేకుండా పోయిందని, అయితే తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించామని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు. చైనా వైపు కూడా పలువురు భారతీయులు చిక్కుకుపోయారని ఆయన పేర్కొన్నారు.
ఈ విపత్తు నేపథ్యంలో సహాయ చర్యల్లో భాగంగా, సహాయక సామగ్రితో కూడిన రెండు విమానాలను భారత్ నేపాల్కు పంపిందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన చెప్పారు. కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళిన వారిలో తమిళనాడుకు చెందిన 49 మంది, పశ్చిమ బెంగాల్కు చెందిన 32 మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది, కేరళకు చెందిన 33 మంది గల్లంతు ఆయన వారిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాఠ్మండులోని ఇండియన్ రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందన్నారు.



