మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం

– ప్రజలందరూ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములే
– అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొవాలి
– డా. బిఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఓటు హక్కు
– జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజలందరూ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములే. 18 సంవత్సరంలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవడం తో పాటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం 14 వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నేను ఓటరుగా గర్విస్తున్నాను.. నేను తప్పక ఓటు వేస్తున్నాను.. అనే ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నల్లగొండ పట్టణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్,జడ్పి.సిఈఓ. ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డిఓ రవి, సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మర బోయిన కేశవులు,వివిధ శాఖల జిల్లా అధికారులు, పలు కళాశాలల విద్యార్థులు, ఎన్సిసి. ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
     ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణం లో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గా ఓటు హక్కు వినియోగించుకొని ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో ఓటర్లు ఓటు వేసేలా ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కలిగించాలని అన్నారు. 80 సంవత్సరములు దాటిన వయో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుండి ఓటు వేయుటకు హోం ఓటింగ్ సౌకర్యం ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఓటుకు ఎంతో ప్రాముఖ్యత ఉదని, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు అవకాశం కలిగిందని తెలిపారు.

    ఓటర్ జాబితా లో తమ పేరు కలిగి ఉన్నారా ఓటర్ లు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. త్వరలో జరగనున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అర్హత కలిగిన పట్టభద్రులు అందరూ కొత్తగా ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటర్ జాబితా తాజాగా రూపొందించడం జరుగుతుందని, ఇది వరకు ఓటర్ గా నమోదు అయిన వారు కూడా మళ్లీ కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదనపుకలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినం అయిన ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు అనిఅన్నారు. గతంలో సమాజంలో పురుషులు, మహిళలు పట్ల తారతమ్యాలు, మహిళల పట్ల వివక్ష వుండేదని అన్నారు.భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం కల్పించిందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో నూతనంగా నమోదైన యువ ఓటర్ లకు జిల్లా కలెక్టర్ ఫోటో ఓటర్ గుర్తింపు ఎపిక్ కార్డ్ లు పంపిణీ చేశారు. 90 సంవత్సరం లు దాటిన వయో వృద్ధులైన ఓటర్ లను కలెక్టర్ శాలువాతో సన్మానం చేశారు.

Spread the love