– ప్యాసింజర్ల మద్దతు కోరుతూ బ్రోచర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఓలా, ఊబర్ సంస్థల తీరుతో క్యాబ్ యజమానులు, డ్రైవర్లు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. ఈ దోపిడీని ప్యాసింజర్లకు తెలుపుతూ, వారి మద్దతు కోరుతూ రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ను శనివారంనాడిక్కడ ఆవిష్కరించారు. ఈ బ్రోచర్లను క్యాబ్లో సీట్ల వెనుక ఉంచి, వాటిపై ప్యాసింజర్ల అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాలని కోరతామన్నారు. యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల వల్ల దాదాపు పదివేల మంది నిరుద్యోగ డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. డ్రైవర్లకు కనీస వేతనం హామీ లేదనీ, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ప్రోత్సాహకాలను తగ్గిస్తున్నారనీ, డ్రైవింగ్ నిర్వహణ ఖర్చులు, ప్రమాదబీమా వంటి ఎలాంటి రక్షణ చర్యలు యాప్ ఆధారిత కార్పొరేట్ సంస్థలు ఇవ్వట్లేదని వివరించారు. దీనిపై ఆక్స్ఫర్డ్కు చెందిన ఫెయిర్వర్క్ అనే సంస్థ 2020లో చేసిన అధ్యయనం వివరాలను ఈ బ్రోచర్లలో పొందుపర్చామన్నారు.