నవతెలంగాణ-ఆలేరు టౌన్
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 26న భువనగిరి పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగే ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం, భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలను రూపొందించనున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్, సామాజిక భద్రత తదితర అంశాలపై కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారం కోసం ఐక్య పోరాటాలను నిర్వహించేందుకు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, రాష్ట్ర కార్యదర్శులు బి వెంకటేశం, పల్లా దేవేందర్ రెడ్డి, సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చెడె చంద్రయ్య తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
జిల్లా మహాసభను కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిర్వహించి, భవిష్యత్ కార్మిక ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఏఐటీయూసీ జిల్లా 3వ మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, నాయకులు పోతూ ప్రవీణ్, కోరుటూరి శ్రీనివాస్, చౌడబోయిన పరశురాములు, మాటూరి జానమ్మ, గిరబోయిన స్వామి, దార ఒదయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



